ప్రధాని మోదీకి జల్‌మురి అమ్మిన వ్యాపారికి పాక్, బంగ్లా నుంచి హత్య బెదిరింపులు

  • పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయని ఆవేదన
  • బాంబులతో పేల్చేస్తామని, ఆయుధాలు చూపిస్తూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వ్యాపారికి భద్రత ఏర్పాటు
  • తనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో జల్‌మురి (మరమరాల మిక్చర్) అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి జీవితం ఒక్కసారిగా భయాందోళనలతో నిండిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీకి స్నాక్స్ అందించినప్పటి నుంచి అతనికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ను ఆపి, విక్రమ్ సావో అనే ఈ వ్యాపారి దుకాణం వద్ద జల్‌మురి రుచి చూశారు. ప్రధానితో ఆయన సంభాషించిన దృశ్యాలు జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో విక్రమ్ సావో రాత్రికిరాత్రే 'స్టార్ జల్‌మురి వాలా'గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే, ఆ ప్రచారమే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది.

గత కొన్ని రోజులుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి తనకు రోజూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. "పాకిస్థాన్ నుంచి పదేపదే వీడియో, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బాంబులతో నన్ను పేల్చేస్తామని బెదిరిస్తున్నారు" అని ఆయన ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ తెలిపారు. వీడియో కాల్స్‌లో కొందరు భయానకమైన సైగలు చేస్తూ, ఆయుధాలు చూపిస్తూ తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని వివరించారు.

అంతేగాక‌ బంగ్లాదేశ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని, "నువ్వు బతికే ఉన్నావా? చచ్చావా?" అని అడుగుతూ భయపెడుతున్నారని చెప్పారు. "నిన్ను బాంబు పేలుడులో చంపేస్తాం" అని వాట్సాప్ సందేశాలు కూడా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కాల్ చేస్తున్న వారు ప్రధానితో తనకున్న సంబంధం గురించి నేరుగా ఏమీ మాట్లాడటం లేదని, కానీ మోదీ తన దుకాణానికి వచ్చిన తర్వాతే ఈ బెదిరింపులు మొదలయ్యాయని విక్రమ్ స్పష్టం చేశారు. ఈ బెదిరింపులతో తానూ, తన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్నామని చెప్పారు.

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విక్రమ్ సావోకు భద్రత కూడా కల్పించారు. ప్రస్తుతం పోలీసులు ఆయనకు కాపలాగా ఉంటున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం తనకు, తన కుటుంబానికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరారు.

Vikram Sao
Jhalmuri
Narendra Modi
West Bengal
Pakistan
Bangladesh
Death Threats
Indian Politics
Security Threat
Jargram

More Telugu News